హైదరాబాదు ఎగ్జిబిషన్హైదరాబాదు నగరంలో ప్రతి యేటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు నాంపల్లిలో జరిగే పారిశ్రామిక ప్రదర్శననే హైదరాబాదు ఎగ్జిబిషన్ (నుమాయిష్).[1] దీనిని అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనశాల (All India Industrial Exhibition) గా కూడా వ్యవహరిస్తారు. నాంపల్లిలో ఈ ప్రదర్శన జరిగే మైదానం ఎగ్జిబిషన్ గ్రౌండ్గా ప్రసిద్ధి చెందినది. చరిత్రఏప్రిల్ 6వ తేదీ, 1938లో ఏడో నిజాం ఉస్మాన్అలీ ఖాన్ చేతుల మీదుగా ప్రారంభించారు[2], మొదట 100 స్టాళ్లతో 10 రోజులపాటు జరిగిన ఈ ప్రదర్శన శాల 1946 వరకు పబ్లిక్ గార్డెన్స్లో నుమాయిష్ నిర్వహించారు. తరువాత 10 రోజుల నుంచి 15 రోజుల వరకు పెంచారు. 1946లో హైదరాబాద్ అప్పటి ప్రధాని సర్ మీర్జా ఇస్మాయిల్ వేదికను నాంపల్లి గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నారు.1947లో దేశానికి స్వాతంత్య్రం రావడం, 1948లో హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనం కావడంతో ఈ రెండేళ్లు నుమాయిష్ ఏర్పాటు చేయలేదు. 1949లో తిరిగి నాంపల్లి మైదానంలోనే తిరిగి అప్పటి హైదరాబాద్ రాష్ట్ర గవర్నర్ జనరల్ సి.రాజగోపాల చారి చేతుల మీదుగా ప్రారంభించారు. అప్పుడు నుమాయిష్ పేరును అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్)గా మార్చారు. ప్రస్తుతం 2600 స్టాల్స్లతో శోభాయమానంగా ప్రదర్శించబడుతోంది. చిన్నలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సందర్శించడానికి ఆసక్తి చూపబడే ఈ ప్రదర్శనశాలలో కేవలం పారిశ్రామిక వస్తువులే కాకుండా పలు రకాల ఆటలు, వినోద కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. పలు దుకాణాలు సరాసరిగా ఆయా పారిశ్రామిక సంస్థల వారే నిర్వహిస్తుండటం విశేషం. దీని వలన సందర్శకులకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు లభిస్తాయి. పలు రకాలైన తినుభండారాలు కూడా ప్రదర్శనశాల లోపల లభిస్తాయి. ఈ ప్రదర్శనశాల నిర్వహించబడే 46 రోజులపాటు ప్రతి రోజు సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రదర్శన స్థలం వరకు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తుంది. హైదరాబాదులో నిర్వహించబడుతున్న ఈ పారిశ్రామిక ప్రదర్శన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పేరు సంపాదించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రాత్సహించడమే కాకుండా వినియోగదార్లను చైతన్యవంతం చేయడానికి ఇది దోహదపడుతోంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు అనేక కార్యక్రమాలను, అభివృద్ధి పథకాలను కూడా ప్రదర్శనకు ఉంచుతారు. జనవరి 1వ తేదీ నాడు ముఖ్యమంత్రి దీన్ని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రదర్శనా మైదానంలో స్టాల్స్ల కేటాయింపు, సందర్శకులకు సౌకర్యాలు మొదలగు నిర్వహణా కార్యకలాపాలను ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తుంది. ఈ సొసైటీకి నగరంలోని పురపాలక శాఖ, నీటిపారుదల శాఖ, రోడ్డు భవనాల శాఖ, ట్రాఫిల్ పోలీస్ శాఖ మొదలగు శాఖలు సహకరిస్తాయి. ఈ ప్రదర్శన వలన ఆదాయంతో సొసైటీ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అనేక కళాశాలలు కూడా ఈ సొసైటీ విరాళాలతో నిర్వహించబడుతున్నాయి. 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్ (2022)) జనవరి 1 నుంచి 45 రోజుల పాటు జరగాల్సిన ప్రదర్శన కోవిడ్ మహమ్మారి వలన వాయిదా పడి ఫిబ్రవరి 25 నుండి మొదలైంది.[3] ఇక 82వ, 83వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాలలు ఆయా సంవత్సరాలలో జనవరి 1వ తేదీన ప్రారంభమవగా 2025లో జనవరి 3న ఔత్సాహికులను అలరించనుంది.[4] ప్రదర్శనశాల విషయాలు
ఇవి చదవండిమూలాలు
|